మంచిర్యాల,జూన్20:నీట్ రీ-పరీక్ష నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 (పూర్వపు సెక్షన్ 144) ప్రకారం నిషేధాజ్ఞలను అమలు చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులు 21-06-2026 ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు అమలులో ఉంటాయని,వాటిని ఎవరైనా ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. మంచిర్యాల జోన్లోని మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు,అవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మంచిర్యాలలో ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని, సభలు,సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధించబడిందని పేర్కొన్నారు.అదేవిధంగా, పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను 21-06-2026 ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.అదేవిధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

