చెన్నూరు, జూన్7: కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడ,వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో, దస్నాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఈ క్రమంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని త్వరితగతిన కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం తరలింపు కొరకు అవసరం మేరకు హమాలీల సంఖ్యను పెంపొందించుకోవాలని తెలిపారు.అనంతరం వేమనపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో కలిసి వరి ధాన్యం తరలింపునకు కావలసిన రవాణా సౌకర్యానికి సంబంధించిన కార్యాచరణ పరిశీలించి, రవాణా గుత్తేదారులతో చరవాణి ద్వారా మాట్లాడి అదనపు లారీలను కేటాయించాలని, రానున్న వర్షాకాలం దృష్ట్యా కొనుగోలు చేసిన వరి ధాన్యం యుద్ధ ప్రాతిపదికన ఈరోజు రాత్రి కల్లా తరలించి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
previous post

