తెలంగాణ,మే18:రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.ఆదిలాబాద్, మంచిర్యాల,నిర్మల్,జగిత్యాల,పెద్దపల్లి,కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి.నిజామాబాద్ జిల్లాలో 45.7 డిగ్రీలు,మంచిర్యాలలో 45.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 45.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఉదయం నుంచే మండుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.ప్రజలు ఎక్కువగా నీరు,మజ్జిగ,పండ్లరసాలు తీసుకోవాలని,ఎండలో తిరిగేటప్పుడు టోపీ,గొడుగు ఉపయోగించాలని అధికారులు సూచించారు.

