దేశవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ‘ఎల్ నినో’ ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలి ప్రవాహాల్లో మార్పులు చోటుచేసుకుని, దక్షిణ పశ్చిమ మాన్సూన్ ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా మే నెలలో ఎండ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.ఎండల తీవ్రతతో హీట్ స్ట్రోక్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేయకముందే తరచుగా నీరు తీసుకోవడం, పిల్లలు మరియు వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరమని తెలిపారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యంత వేడి ఉండే సమయమని, ఈ సమయంలో బయటకు వెళ్లడం నివారించాలన్నారు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు.హీట్ స్ట్రోక్ లక్షణాలుగా తలనొప్పి, తల తిరగడం, వాంతులు, చెమట రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులను వెంటనే నీడలోకి తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు.వేసవి కాలంలో జంతువులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో, వాటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ‘ఎల్ నినో’ ప్రభావాన్ని ఎదుర్కొవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
previous post

