నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయం ముందు మరియు ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో రేకుల షెడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. వేసవిలో ఎండ వేడి, వర్షాకాలంలో వర్షం నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ షెడ్ల నిర్మాణానికి నస్పూర్కు చెందిన రాచకొండ ఆశాలత – వెంకటేశ్వరరావు (బుజ్జన్న) దంపతుల కుమారుడు అమెరికాలో ఉద్యోగంలో చేరిన అనంతరం తన మొదటి జీతాన్ని దేవునికి సమర్పిస్తూ రూ.2,55,000 విరాళంగా అందజేశారు. ఈ విరాళం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ పేర్కొంది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ ఆశాలత – వెంకటేశ్వరరావు (బుజ్జన్న) దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీ గణపతి స్వామి అనుగ్రహం వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ, వారి సేవా భావం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

