కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు
కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్
ఆరోగ్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట మైసమ్మ గాంధారి వనం పరిసరాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు, అలాగే ఆర్కే–1 ఏ ప్రాంతంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే శ్మశానవాటిక నిర్మాణ పనులకు మంగళవారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఓపెన్ జిమ్ల ద్వారా సులభంగా వ్యాయామం చేసుకునేందుకు సహాయపడతాయని, శరీర దారుఢ్యాన్ని, ఒత్తిడి, అలసటలను తగ్గిస్తాయని, ఓపెన్ జిమ్లలో సూర్యరశ్మి సహజ గాలిని పొందటం ద్వారా విటమిన్-డి లోపాన్ని తగ్గించవచ్చని, దీనివల్ల మనస్సు, శరీరం శక్తివంతంగా మారుతుందని, ఆరోగ్యం కాపాడుకోవడానికి, జీవనశైలిని సక్రమంగా మార్చుకోవడానికి ఓపెన్ జిమ్లు ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్మశానవాటికను ఆధునికంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతంలో ప్రాథమిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి కమీషనర్ గద్దె రాజు, నాయకులు అబ్దుల్ అజీజ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

