మంచిర్యాల,సెప్టెంబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయపడుతున్న కొందరు ప్రత్యర్థులు ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.ఫ్లెక్సీలను చింపినంత మాత్రాన జనసేన పార్టీని ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని నాయకులు స్పష్టం చేశారు. ఫ్లెక్సీని చింపగలరేమో కానీ, జనసేన పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మాత్రం చింపలేరని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉందని పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కోవాలని, ఇలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం అప్రజాస్వామిక చర్య అని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.ఈ ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి, ఫ్లెక్సీలను చింపివేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాంటి పక్షపాత ధోరణికి తావులేకుండా న్యాయం వైపు నిలబడి విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై విశ్వాసం ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. మరోసారి ఇటువంటి చర్యలు జరిగితే తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున శాంతియుత నిరసనలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేస్తామని స్పష్టం చేశారు.అయితే, జనసేన పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఉద్రిక్తతలకు లోనుకాకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆదరణ, విశ్వాసమే జనసేన పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు.
జై జనసేన!
జై పవన్ కళ్యాణ్!

