బొక్కలగుట్ట,ఆగస్టు 8:రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలో నిర్వహించనున్న బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతరకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు.జాతర బందోబస్తు ఏర్పాట్లపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. జాతర సందర్భంగా సుమారు 200 నుంచి 300 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దర్శనం సాఫీగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పోలీసు అధికారులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని సూచించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాతర ప్రాంగణంలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ ఆదేశించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని, జాతర ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతర సందర్భంగా భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

