మంచిర్యాల, జూలై 12 (నేటి ప్రజా తెలంగాణ): యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షలను పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు తాండూరు మండలంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ, హాజరు నమోదు, ప్రశ్నాపత్రాల పంపిణీ, ఇన్విజిలేషన్ విధానాన్ని పరిశీలించారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, పరిశుభ్రతతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం తాండూరు, నెన్నెల మండలాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఫారాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

