షార్ట్ కట్ మార్గాల ప్రయాణం ప్రమాదం… సరైన మార్గమే సురక్షితం…
“సురక్షితంగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా ఉండండి”
రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న 25 ద్విచక్ర వాహనాలు సీజ్
సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డ
షార్ట్ కట్ మార్గాలలో ప్రయాణం ప్రమాదకరమని, సరైన మార్గంలో ప్రయాణించడం సురక్షితం అని సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతకు భంగం కలిగించే వాహనదారులపై మందమర్రి పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత నాలుగు రోజులుగా బురద గూడెం, అందుగులపేట జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలపై తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్ టి ఓ) కార్యాలయానికి నివేదించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ “ప్రజలు తమతో పాటు ఇతరుల భద్రత కోసం తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి” అని కోరారు. వాహనదారులు షార్ట్ కట్ మార్గాలలో ముఖ్యంగా జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ప్రయాణించడం వలన జరిగే తీవ్ర ప్రమాదాలను గుర్తించి, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, సరైన మార్గంలోనే ప్రయాణం చేయాలని, “సురక్షితంగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా గమ్యం చేరండి, సురక్షితంగా ఉండండి” అనే నినాదంతో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.
రాంగ్ రూట్ వాహనదారులకు సిఐ హెచ్చరిక
ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా రాంగ్ రూట్లో వచ్చే ఏ వాహనాన్ని కూడా ఉపేక్షించేది లేదని, ఇక ముందు కూడా రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వాహనదారులను హెచ్చరించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

