తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు
ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తున్న ఈ అందగత్తెలు.. తాజాగా తెలంగాణ సచివాలయ సందర్శనకు వెళ్లారు. అక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి.. ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సచివాలయ పరిసరాల్లో కలియతిరిగారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తేనీటి విందు ఏర్పాటు చేసింది.
*ఆకట్టుకున్న డ్రోన్ ప్రదర్శన*
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ సచివాలయ సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. డ్రోన్ షో ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా రంగుల్లో, విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర సచివాలయం వెలుగులీనింది.