అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
రైతుల కోసం
న్యాయవాది ఏమాజి పోరాటం
దళిత, గిరిజన రైతులను వారి భూముల్లో సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారుల పై వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతులు నీల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి నీలవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ పటేల్ కు కంప్లైంట్ చేశారు. అటవీశాఖ అధికారుల పై చర్య తీసుకోవాలని కోరారు. దళిత రైతుల పక్షాన న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి పోరాటం చేస్తున్నారు. జిల్లా అధికారులు చర్య తీసుకోకుంటే రైతుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గతంలో భీమినీ మండలం కేస్లాపూర్, కన్నెపల్లి మండలం కొత్తపల్లి, నెన్నెల మండలం ఖర్జీ, జంగాలపేట, వేమనపల్లి మండలం బమ్మెన, బద్దంపల్లి, చామనపల్లి, నాగారం, సూరారం గ్రామాల రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా నిలిచారు. కేస్లాపూర్లో 200 ఎకరాల భూమిని రైతులకు ఇప్పించారు. బెల్లంపల్లి నుండి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ప్రస్తుతం చామనపల్లి రైతుల కోసం పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో రైతులు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నరాజ సిసోడియా, బిజెపి జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్య, బానయ్య, లింగయ్య, పర్వతాలు, మధుకర్, సతీష్, రాజయ్య, మల్లయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.