* ఘనంగా దళితుల పోరాట యోధుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
* దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడికి ఘనమైన నివాళి
* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంచిర్యాల జిల్లా కేంద్రం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈ.డి.చాతరాజుల దుర్గాప్రసాద్,అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి,అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం భాగ్యరెడ్డి వర్మ విశేష కృషి చేశారని అన్నారు.బాల్య వివాహాలు,అంటరానితనం, దేవదాసి,జోగిని వ్యవస్థలను రూపుమాపేందుకు పోరాటం చేశారని తెలిపారు. అంతేకాకుండా దళిత ఉద్యమ పితామహుడుగా, సంఘసంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, సమాజంలో దళితుల చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. అదేవిధంగా మహానుభావుల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని,మహనీయుల చరిత్ర,త్యాగాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. దేశ భవిష్యత్తు,ప్రజల సంక్షేమం కోసం మహనీయులు ఆచరించిన మార్గాలను భావితరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్,సంబంధిత శాఖల అధికారులు,వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.