హైదరాబాద్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా. మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42 డిగ్రీలు నమోదయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీచేసింది. ఆరుబయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.